Telangana govt start Anganwadi Play schools(TS today news):
నిధుల కొరతతో నీరసించిన అంగన్ వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. అదే సమయంలో అంగన్ వాడీ ఆధ్వర్యంలో కాన్వెంట్ల తరహాలో ప్లే స్కూల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉంది. దీనితో తల్లిదండ్రులు తమ పిల్లలను డబ్బులు ఎక్కువైనా ఫరవాలేదు..ప్రైవేటు స్కూల్స్ లో తమ పిల్లలను చేరుస్తున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న ఫీజులు కట్టుకోలేక..అటు ప్రభుత్వ పాఠశాలలకు పంపలేక సతమతమవుతూ వస్తున్నారు.
రేవంత్ విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరినాక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. నిధుల కొరత ఉన్నా..రాష్ట్రంలో విద్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి చెప్పి నూతన తరహా విద్యా వ్యవస్థ రావాలని కోరుకుంటున్నారు. అందుకు ప్రభుత్వ అధికారులను సంసిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అన్ని నియోజకవర్గాలలో సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందుకు అధికారులు కూడా సీఎం సూచనకు మద్దతు తెలిపారు.
అంగన్ వాడీ కార్యాలయాలలో ఇక నుంచి ప్లే స్కూల్స్ తరహాలో మూడవ తరగతి దాకా విద్యార్థులకు విద్యనందించాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను సూచించారు. అయితే అదనపు ఖర్చవుతుందని..ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకోవాల్సి వస్తుందని అధికారులు సూచించడంతో నిధుల గురించి ఆలోచించవద్దని చిన్నారుల సంరక్షణ కేంద్రాలుగా ఉన్న అంగన్ వాడీలు ఇకపై ప్లే స్కూల్స్ గా రూపాంతరం చెందాలని సీఎం గట్టి నిర్ణయమే తీసుకున్నారు.
సెమీ రెసిడెన్సియల్ పాఠశాలలు
ఇక ప్లే స్కూల్ తర్వాత 4వ తరగతి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేరడానికి ఈ ప్లే స్కూల్ లో చదివిన విద్యార్థులకే అవకాశం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయే సెమీ రెసిడెన్సియల్ పాఠశాలలకు రవాణా సదుపాయాలు కల్పించాలని..విద్యార్థులకు ఉచితంగానే రవాణా సదుపాయం కల్పించాలని అందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై సంబంధిత అధికారులను నివేదిక అందించాల్సిందిగా కోరారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేయబోయే సెమీ రెసిడెన్సియల్ పాఠశాలలలో మైనారిటీ, ఎస్టీ, ఎస్సీ తదితర పాఠశాలలన్నీ కలిపి ఒకే చోట ఉండేలా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు.
ముందుగా పైలట్ ప్రాజెక్టులు
ప్లే స్కూల్స్ ఎలా నడపాలో విద్యావేత్తల సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. వారికి సంబంధించిన పాఠ్యాంశాలు, ఏ తరహా శిక్షణ ఎలా ఇవ్వాలి, పాఠశాల సమయం తదితర అంశాలపై సీనియర్ విద్యావేత్తల సూచనలు తీసుకోవాలని సీఎం సూచించారు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలాలలో ఆరంభించి దానికి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్ వాడీల కేంద్రాలలో ప్లే స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముందుగా మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్, ఖమ్మం పరిధిలోని మధిర నియోజకవర్గాలలో ఈ పైలెట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు