Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఆరో ఫ్లోర్’లో గల కేబినెట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు.
నూతన రెవెన్యూ చట్టానికి లైన్ క్లియర్…
తొలుత ఈనెల 23న మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ భావించింది. కానీ అనూహ్యంగా దాన్ని 26కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రకటన చేయడం గమనార్హం. ఇక తాజా భేటీలో నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుందట. ధరణి స్థానంలో తెచ్చిన భూమాత పోర్టల్ కోసమూ ఆమోదం తెలపనున్నారని సమాచారం.
హైడ్రాకు ఎక్స్ ట్రా పవర్…
మరోవైపు చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని పవర్స్ కల్పించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్’కి సవరణలు చేపడతారని తెలుస్తోంది. ఇదే సమయంలో గతంలో ఉన్న వీఆర్ఎస్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ లోనూ దానిపై చర్చించనున్నారు. ఈ సందర్భంగానే గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నారట.
సగం వాళ్లకు, సగం వీళ్లకు…
గ్రామ రెవెన్యూ అధికారి ఉద్యోగాలను వీఆర్వో, వీఆర్ఏలతోనే సగం పోస్టులు భర్తీ చేయాలని సర్కారు యోచిస్తోంది. మిగతా సగం ఉద్యోగాలు కొత్తవారితో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నింపాలన్నది గవర్నమెంట్ ప్లాన్ గా తెలుస్తోంది. తాజాగా ఈ కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలపై కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం…
శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైడ్రా, కొత్త రెవెన్యూ బిల్లులపై ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్ ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రెండు డ్రాఫ్ట్ బిల్లులపైనా కేబినెట్ లో చర్చలు చేయనున్నట్లు తెలిసింది. ఇక నవంబర్ నెలలో నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల తేదీలపై ఈ భేటీలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఒరిజినల్ బాంబులకే మేం భయపడలే, గీ సుతిల్ బాంబులకు భయపడతమా ? అధికారంలోకి వస్తాం, అప్పుడు చూసుకుంటం : కేటీఆర్