– హస్తినలో సీఎం రేవంత్
– హోం శాఖ సమీక్షకు హాజరు కానున్న ముఖ్యమంత్రి
– వరద సాయంపై అమిత్షాకు వినతి పత్రం
– అధిష్ఠానంతో భేటీ.. కీలక అంశాలపై చర్చ
– పలు కేంద్ర మంత్రులనూ కలిసే అవకాశం
– దసరా లోపే కేబినెట్ విస్తరణకు అవకాశం
– సీఎం పర్యటనపై ఆశావహుల్లో ఉత్కంఠ
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. సోమవారం కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉండకూడదనే టార్గెట్గా కేంద్రం పని చేస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ పర్యటనలో సీఎంతో కలిసి పాల్గొననున్నారు.
Also Read: దసరా వేళ సంతోషంలో కాంగ్రెస్ కేడర్.. త్వరలోనే మరిన్ని..
మీటింగ్ ఎజెండా ఇదే..
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రం, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ సమావేశంలో చర్చించనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకు మరింత మెరుగైన రోడ్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రం చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, కావాల్సిన నిధులపై ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కేంద్రానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
వరద సాయంపై వినతి..
ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తెలంగాణను ముంచెత్తిన వరదల తాలూకూ కేంద్రం అందించాల్సిన నష్టపరిహారం గురించి అమిత్ షాకు ప్రత్యేకంగా వినతి పత్రం ఇవ్వనున్నారని తెలుస్తోంది. గత వరదల మూలంగా తెలంగాణకు రూ. 10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లగా, కేంద్రం తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ నిధుల కింద కేవలం రూ. 416.80 కోట్లు అందించింది. ఈ విషయాన్ని సమగ్ర నివేదిక రూపంలో మరోసారి గుర్తుచేసి, మరింత సాయం అందించాలని ముఖ్యమంత్రి.. అమిత్ షాను కోరనున్నారు.
Also Read: ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి
అధిష్ఠానంతో భేటీ
ఈ పర్యటనలో భాగంగా సీఎం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా కలిసి పలు కీలక అంశాల మీద చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల వ్యవహారంపై సీఎం పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారని, దసరా కంటే ముందే వీటిని క్లియర్ చేయాలని అటు పార్టీ పెద్దలూ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యాబినెట్ లో 6 బెర్తులు ఖాళీగా ఉండగా, డజనుకు పైగా నేతలు పోటీపడుతున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఈసారి ఈ అంశంతో బాటు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల ఎంపిక జరగనుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.