Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు.
గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎలా ఉంది. భవిష్యత్తులో ఎలా ఉండబోతోందనే అంశాలతో గవర్నర్ ప్రసంగం ఉండాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో ఇప్పటికే రెండు పథకాలు అమల్లోకి వచ్చాయి మిగతా నాలుగు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. ప్రజలను అభివృద్దికై ప్రభుత్వం చేపట్టబోయే పథకాల గురించి సైతం గవర్నర్ ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది.