Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. 23వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరుసటి రోజు నుంచే మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికల కారణంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఇప్పుడు పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్తోపాటు ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించనుంది. రైతు రుణమాఫీని ఏకకాలంలో విడుదల చేస్తున్న ప్రభుత్వం ఈ అంశంపై విస్తృతంగా చర్చ చేసే అవకాశముంది. అయితే, ఇది వరకే ప్రతిపక్షాలు రైతు భరోసా ఎందుకు వేయడం లేదనే ప్రశ్నలు వేస్తున్నాయి. ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశముంది.
పోటీ పరీక్షల వాయిదా, నోటిఫికేషన్లపైనా అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇది వరకే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు అంశంపైనా అసెంబ్లీలో చర్చిస్తారు. కొత్త చట్టం ఆర్వోఆర్ పైనా చర్చించే చాన్స్ ఉన్నది. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై చర్చించే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గ్రేటర్ పరిధిలోని మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం మరింత క్షీణిస్తుంది. అయితే, పార్టీ ఫిరాయింపులను బీఆర్ఎస్ ప్రధానాంశంగా మార్చుకుని ఆందోళన చేసే అవకాశముంది. రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే.. ఇక్కడ ఆయన పార్టీ మాత్రం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నదని బీఆర్ఎస్ అగ్రనాయకులు విమర్శలు కురిపించే అవకాశం ఉన్నది.
Also Read: బడ్జెట్ తయారీలో దశలు.. ప్రీ క్లైమాక్స్లో హల్వా వేడుక!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన గత అసెంబ్లీ సమావేశాలు కూడా హాట్ హాట్గా జరిగాయి. పలు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేసి బీఆర్ఎస్ పై విమర్శలు కురిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, అనారోగ్య కారణాల వల్ల మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు అసెంబ్లీ చర్చలకు రాలేదు. ఈ సారి ఆయన సమావేశాలకు వచ్చే అవకాశాలున్నాయి. కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తే ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల మధ్య జోరుగా చర్చ జరిగే అవకాశముంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై గట్టి చర్చ జరిగే అవకాశం ఉన్నది. రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు గతంలో సవాల్ చేశారు. ఈ సవాల్ కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేవు.