Budget: బిగ్ న్యూస్ ఇది. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుందని హైకోర్టుకు తెలిపింది. దీంతో, ఏడాదిగా రగులుతున్న ఇష్యూ.. ఇప్పటికి కొలిక్కి వచ్చినట్టైంది. మరోవైపు, బడ్జెట్ సెషన్ ఆరంభ తేదీని సైతం మార్చే ఆలోచనలో ఉంది సర్కారు.
అంతకుముందు తెలంగాణ హైకోర్టులో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఈ ఏడాది బడ్జెట్కు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకపోవడంపై హైకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ, మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్ను ఆదేశించాలని కోర్టును కోరింది. విచారణ జరిపేందుకు సీజే ధర్మాసనం అంగీకరించింది. గవర్నర్కు కోర్టు నోటీసు ఇవ్వగలదా? అనే సందేహమూ వ్యక్తం చేసింది.
విరామం తర్వాత కేసు విచారణ సమయంలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఇరుపక్షాల న్యాయవాదులూ చర్చించుకొని ఓ నిర్ణయానికి రమ్మని సూచించింది సీజే ధర్మాసనం. దీంతో చర్చల అనంతరం ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు న్యాయవాది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని కోర్టుకు తెలిపారు.
కొన్నివారాలుగా ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య బడ్జెట్ ఫైట్ జోరుగా సాగుతోంది. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది సర్కారు. గత అనుభవంతో.. ఈసారి గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి పెద్ద ట్విస్టే ఇచ్చారు. తన దగ్గరకు వచ్చిన బడ్జెట్ పై సంతకం చేయకుండా వెయిట్ అండ్ సీ అన్నట్టు ఉన్నారు. దీంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి రెండుసార్లు లేఖలు రాసింది. అయినా, గవర్నర్ సంతకం చేయనేలేదు.
మరోవైపు బడ్జెట్ కు సమయం దగ్గరపడుతోంది. గవర్నర్ సంతకం చేస్తేనే.. బడ్జెట్ ను కేబినెట్ ఆమోదిస్తుంది.. ఆ తర్వాతే అసెంబ్లీ, శాసన మండలిలో ప్రవేశపెడతారు. ఇదంతా జరగాలంటే గవర్నర్ ముద్ర తప్పనిసరి. లేదంటే, ప్రభుత్వం ఆటోమెటిక్ గా రద్దు అయిపోతుంది. అందుకే, సర్కారుకు షాక్ ఇచ్చేలా గవర్నర్ తమిళిసై వ్యూహాత్మకంగా ఆలస్యం చేశారని అంటున్నారు. ఈ సారి బడ్జెట్ సెషన్ లో తన ప్రసంగం ఉంటుందా? అని ప్రశ్నిస్తూ ఆర్థిక శాఖకు రిటర్న్ లెటర్ పంపించారు.
ఆందోళన చెందిన కేసీఆర్ సర్కారు.. గవర్నర్ బడ్జెట్ ను ఆమోదించకపోవడంపై హైకోర్టుకు వెళ్లింది. అంతలోనే ఏమైందో ఏమో కానీ.. గంటల వ్యవధిలోనే ప్రభుత్వం తన పిటిషన్ ను ఉపసంహరించుకుంది. అలాగే, ఈసారి గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సెషన్ ప్రారంభం అవుతుందంటూ హైకోర్టుకు తెలిపింది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాల ప్రారంభ తేదీని ఫిబ్రవరి 3 నుంచి 6కు మార్చుతారంటూ ప్రచారం జరుగుతోంది.