Telangana Bjp List : తెలంగాణలో ఎన్నికల వేడి కాకరేపుతోంది. శుక్రవారం బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఆశావహులు మరింత టెన్షన్ పడుతున్నారు. ఇక ఎన్నికల బరిలో నిలిచే క్యాండిడేట్స్ లిస్ట్పై కసరత్తు పూర్తికావడంతో నేడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో తొలి జాబితాలో 65 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ నివాసంలో పలుమార్లు సమావేశమై ఈ లిస్టుపై చర్చలు జరిపారు. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిసహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.మరోసారి నడ్డాతో చర్చల అనంతరం తుది జాబితాను సిద్ధం చేసి.. సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంరతం తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
ప్రజాక్షేత్ర రణరంగంలో అధికారమే లక్ష్యంగా ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారహోరులో ఉన్నాయి. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచార జోరును కొనసాగిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో నత్తనడక ధోరణితో వ్యవహరిస్తోందంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో బీజేపీ స్పీడ్ పెంచింది. మరోపక్క ఎన్నికల సమయం కూడా దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టి.. వరుస భేటీలు నిర్వహించి.. చివరికి 65 మంది క్యాండిడేట్స్తో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది అధిష్టానం. తెలంగాణ బీజేపీ పెద్దలైన ఈటల రాజేందర్, బండి సంజయ్ వంటి వారికి టిక్కెట్ కన్ఫర్మ్. వీరు కాకుండా మిగతా నేతల్లో ఎవరికి టికెట్ వస్తుందోనని ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.