KishanReddy: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు.. బీజేపీలో సీనియర్ లీడర్.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన నేత.. ప్రస్తుతం కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గంగాపురం కిషన్ రెడ్డి తన ప్రస్తానంలో.. కీలక పదవి బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటకలో ఓటమి తర్వాత.. తెలంగాణపైనే ఆశలు పెట్టుకున్న కాషాయం పార్టీ.. అందుకు సమాయత్తంగా తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డికి అప్పగించింది.
11 ఏళ్ల వయస్సులోనే.. పాఠశాల విద్యనభ్యసిస్తున్న సమయంలోనే.. విద్యార్థి నాయకుడిగా మొదలైన ప్రస్తానం కేంద్రమంత్రి వరకు చేరింది. 1977 లో జనతా పార్టీలో కార్యకర్తగా చేరడంతో.. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. RSS సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరారు. ఆ తర్వాత బీజేపీలో తన రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగించారు.
2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అంబర్పేట్ను తన సొంత నియోజకవర్గంగా మార్చుకున్నారు. 2009, 2014లో రెండుసార్లు అంబర్ పేట్ నుంచి విజయాన్ని అందుకున్నారు. అయితే 2018 ఎన్నికల్లో అంబర్ పేట్ నుంచి ఓడిపోవడంతో.. 2019లో సికింద్రాబాద్ లోక్ సభ నుంచి అనూహ్యంగా విజయం అందుకున్నారు. తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన్ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే, ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సమయంలో.. కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడం కీలకంగా మారింది. ఇప్పటికే పార్టీలో అసంతృప్తి ఎగిసిపడుతున్న ఈ సమయంలో.. పార్టీని నడిపించే బాధ్యతలను భుజానెత్తుకోవాల్సి రావడం.. ఆయన సామర్థ్యానికి పరీక్షగా మారింది. నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడమే కాకుండా.. ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఢీ కొట్టి.. పార్టీకి విజయాన్ని అందించగలరా?