Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ముగిశాయి. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే జి. సాయన్నకు శాసనసభలో నివాళులు అర్పించారు. సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
4 దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉన్న సాయన్నతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని తెలిపారు. నిత్యం ప్రజలతో మమేకమైన నిరాడంబర వ్యక్తని ప్రశంసించారు.
సాయన్న లేని లోటు తీర్చలేనిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు. కంటోన్మెంట్ అభివృద్ధికి సాయన్న చేసిన సేవలు మరవలేమని పేర్కొన్నారు. సాయన్నతో తమకున్న అనుబంధాన్ని మరికొందరు సభ్యులు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది.
అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దూరంగా ఉన్నారు. వనమాను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనపై గత ఎన్నికల్లో ఓడిపోయిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అలాగే జలగం వెంకట్రావుకు ఎమ్మెల్యేగా ఇంకా క్లియరెన్స్ రాకపోవడంతో ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు.
తొలిరోజు సభ ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించారు. 20 రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కానీ 3 రోజుల సభ నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు. శాసస సభలో శుక్రవారం వరదలపై చర్చ జరగనుంది. శనివారం వివిధ బిల్లులపై చర్చ జరుపుతారు.
మరోవైపు శాసన మండలిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై చర్చ జరిగింది. సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై మండలిలో సభ్యులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రైతు రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వం వీలనం చేయాలని నిర్ణయించడంపై ఎమ్మెల్సీ ప్రభాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు.