Telangana Assembly : అసెంబ్లీ ప్రాంగణంలోకి మూడు నెలల్లో కౌన్సిల్ భవనం అందుబాటులోకి వస్తుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు తెలిపారు. అసఫ్ జాహీల నిర్మాణశైలితో ఉన్న అసెంబ్లీ పాత భవనాన్ని అదే నిర్మాణ కౌశలంతో అద్భుతంగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.
అసెంబ్లీ ప్రాంగణంలోని హెరిటేజ్ భవనమైన పాత అసెంబ్లీ భవన పునర్నిర్మాణంపై స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్తో కలిసి భవన నిర్మాణ పురోగతిపై సమీక్షించారు ఇరువురు మంత్రులు. భవనాన్ని పునర్నిర్మిస్తున్న ఆగాఖాన్ ప్రతినిధులు, ఆర్ అండ్ బీ అధికారులు, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచార్యులుతో సమావేశం నిర్వహించి, రాబోయే రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని, ఎక్కడా చారిత్రక వైభవానికి ఇబ్బందులు లేకుండా భవనాన్ని సర్వాంగ సుందరంగా తిర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.
ALSO READ : ముత్యాలమ్మ ఘటనపై స్పందించిన కొండా సురేఖ.. ఏమన్నారంటే!
భవనానికి కావల్సిన ఎలక్ట్రిఫికేషన్ వ్యవస్థ, ప్లంబింగ్ పనులపై టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆగాఖాన్ ట్రస్ట్కు సంబంధించిన పెండింగ్లో ఉన్న రూ.2 కోట్ల రూపాయల నిధులను సమావేశం నుంచే ఉపముఖ్యమంత్రితో మాట్లాడి, అప్పటికప్పుడే విడుదల చేయించారు. బిల్లుల కోసం ప్రజోపయోగమైన పనులు ఆపొద్దని అధికారులకు సూచించిన కోమటిరెడ్డి, ఏదైనా బిల్లులు పెండింగ్లో ఉంటే తనకు గానీ సహచర మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పినా వెంటనే విడుదల అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ హెరిటేజ్ భవనం అందుబాటులోకి వస్తే కౌన్సిల్ హాల్ను అసెంబ్లీ భవనంలోకి మార్చవచ్చని పార్లమెంట్ తరహాలో వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు అసెంబ్లీ మరింత చెరువ అవుతుందని తెలిపారు.