Telangana Assembly Budget Sessions 2024: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య కరెంట్ వార్ నడుస్తోంది. ఈ సందర్భంగా పద్దులపై చర్చలో విద్యుత్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. జగదీశ్ రెడ్డి ఆవేదన చూస్తుంటే చర్లపల్లి జైలులో ఉన్నట్లు మాట్లాడుతున్నారని, కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడికి ప్రతిరూపంలో జగదీష్ రెడ్డి చెబుతున్నారన్నారు. విద్యుత్ టెండర్ ఇచ్చి 9 ఏళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదన్నారు. సిగ్గు లేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారని సీఎం చెప్పారు.
చత్తీస్గఢ్, విద్యుత్ కొనుగోలు, యాద్రాద్రి పవర్ ప్లాంట్పై న్యాయ విచారణ జరుగుతోందని సీఎం అన్నారు. గత ప్రభుత్వం ఇండియా బుల్స్ నుంచి వెయ్యి కోట్లు మెక్కారని, భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లల్లో మునుగుతోందని ఆరోపించారు. తెలంగాణకు ఇచ్చిన అదనపు కరెంట్ పై చంద్రబాబు కేసు వేస్తామంటే మేము కొట్లాడామని, తెలంగాణలో పార్టీ నష్టపోతుందని చెప్పి చంద్రబాబుతో కేసు వేయకుండా ఆపించామన్నారు. నేను టీడీపీలో ఉన్నా.. వాస్తవాలు చెప్పానన్నారు.
విద్యుత్పై జుడీషియల్ ఎంక్వైరీ వేస్తామని మేము అనలేదని, కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడగింది మీరేనన్నారు. జుడీషియల్ కమిషన్ ముందుకళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేదన్నారు. విచారణ అంటే భయపడి కోర్టుకు పోయారన్నారు. కానీ హైకోర్టు మీ అభ్యర్థనను తిరస్కరించిందని గుర్తు చేశారు. దీనిపై విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది,
విచారణ కమిషన్ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సాయంత్రంలోగా విద్యుత్పై విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ నియమిస్తామన్నారు.
యూపీఏ ప్రభుత్వ నిర్ణయాలతో కరెంట్ సమస్య తీరిందని, వాస్తవాలు మాట్లాడితే ఆనాడు మార్షల్స్ తో నన్ను బయటకు ఈడ్చుకెళ్లారన్నారు. ఇక, బీహెచ్ఈఎల్ అఖరికి అటెండర్ పోస్టులు కూాడా వాళ్ల బినామీ వాళ్లకే ఇచ్చారన్నారు. ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడిందనని, పవర్ ప్లాంట్ల పేరిట దోపిడీ చేశారన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీని బీహెచ్ఈఎల్ నుంచి కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నారని, ఇండియా బుల్స్ తో చీకటి లావాదేవీల్లో భాగంగా కాలం చెల్లిన టెక్నాలజీని బీహెచ్ఈఎల్కు నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీలో 19 పద్దులపై చర్చ..విద్యుత్ సెక్టార్పై వాడీవేడీగా!
చంద్రబాబుకు తాను శిష్యుడినంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ మండిపడ్డాడు. వైఎస్సార్, చంద్రబాబు పంచన చేరింది మీరేనని సీఎం అన్నారు. మీరెన్ని అబద్ధాలు చెబితే..నేను అన్ని నిజాలు చెబుతానన్నారు. తెలంగాణలో ఎవరైనా గ్లాసు మంచినీళ్లు ఇస్తే కూడా గుర్తుపెట్టుకుంటామన్నారు. పదేళ్లకుపైగా కలిసి పనిచేసిన సహచరులను తిట్టాలని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. మిత్రులను, సహచరులను, పెద్దలను గౌరవించేలా మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పారన్నారు. భోజనం పెట్టిన ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన బీఆర్ఎస్ డీఎన్ఏలో ఉందని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.