Telangana congress party news(Telugu news headlines today): తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై పొలిటికల్ హీట్ పెరిగింది. అమెరికాలో తానా సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే స్పందించారు.
రైతులకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఠాక్రే తెలిపారు. రైతుల గురుంచే ఆలోచిస్తుందన్నారు. అయితే కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు డిక్లరేషన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాలే చూసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ , బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని ఠాక్రే స్పష్టం చేశారు.
మరోవైపు హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ మౌన దీక్ష చేపట్టారు. రాహుల్ గాంధీపై బీజేపీ కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఎంపీ పదవీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండించారు. రాహుల్పై బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ఉచిత్ విద్యుత్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ స్కీమ్ను విద్యుత్ స్కామ్ గా మార్చారని ఆరోపించారు.