Congress Praja Deevena Sabha In manuguru: తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. మహబూబ్ నగర్ లో తొలి సభ నిర్వహించి ఎన్నికల సమర శంఖారాన్ని పూరించింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రజాదీవెన సభ నిర్వహించింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించాలని భ్రమలు పడుతున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు.
మణుగూరు సభ వేదికగా బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తాము గేట్లు తెరిస్తే గులాబీ పార్టీలో ఎవరూ మిగలరని స్పష్టంచేశారు. కేసీఆర్ ఫ్యామిలీ తప్ప అందరూ కాంగ్రెస్ లోకి వచ్చేస్తారని అన్నారు. బీజేపీ ప్రకటించిన 9 సీట్లలో బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించలేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రకటించిన 4 సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంలేదన్నారు.వీళ్ల అవగాహన ఎలా ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.
ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరును ఎందుకు ప్రకటించలేదు? అని నిలదీశారు. గులాబీ పార్టీకి దిక్కులేదా? అని ప్రశ్నించారు. మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత పేరు ఎందుకు ప్రకటించలేదు? ఆమెకు టికెట్ ఇవ్వరా? అని అడిగారు. కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్య వహిస్తున్న మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకడంలేదా? అన్నారు. నిజామాబాద్ లో కవితకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజలు మళ్లీ బండకేసి కొడతారని అనుమానమా? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ లో గతంలో పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ కొడుకుకి టికెట్ ఎందుకు ఇవ్వడంలేదు? అని రేవంత్ నిలదీశారు.
Read More: పేదల కలలతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం.. పదేళ్లు మోసం : సీఎం రేవంత్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు పార్టీకి కార్యకర్తలే బలమని స్పష్టం చేశారు. వారే హస్తం పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 9 స్థానాలు గెలిచింది. ఒక్కస్థానంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. 10 స్థానాలకుగాను 9 సీట్లు గెలిపించినందుకు ఓటర్లకు రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే మహలక్షి, గృహజ్యోతి , ఆరోగ్యశ్రీ పథకాలను ఇచ్చిన మాట ప్రకారమే అమలు చేస్తున్నామన్నారు. మరో గ్యారంటీని అమలు చేయడానికి ఖమ్మంలో శ్రీకారం చుట్టామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో ప్రారంభించారు. పేదల ఇళ్లను దేవాలయాలుగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ. 22, 500 కోట్లు కేటాయించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేశారని మండిపడ్డారు.