Teenmar Mallanna : తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీలోకి ప్రముఖులు వచ్చి చేరుతున్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కీలక నేతలు.. హస్తం గూటిలో చేరుతున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీ-కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే, కర్ణాటక మంత్రి బోస్ రాజు సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మహేశ్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు గురుదీప్ సిప్పల్ పార్టీ కండవా కప్పి.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. జనం సమస్యలతోపాటు బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తూ తీన్మార్ మల్లన్న ప్రజల్లో అభిమానం చూరగొన్న నాయకుడిగా పేరుంది.
తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండగా ఆయన కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశమైంది. గతంలో మేడ్చల్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించిన తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న ఓటమి పాలైనా.. ఓట్లు మాత్రం అధికంగానే వచ్చాయి.