Mallanna: తీన్మార్ మల్లన్న. నిత్యం క్యూ న్యూస్లో రచ్చ చేసే జర్నలిస్టు. సర్కార్పై, కల్వకుంట్ల ఫ్యామిలీపై పదునైన విమర్శలు చేసే నాయకుడు. కేసీఆర్కు వ్యతిరేకంగా తెలంగాణలో వినిపించే బిగ్ వాయిస్ మల్లన్నదే. ఇంత చేస్తుంటే.. ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇప్పటికే పలుమార్లు ఆయన కార్యాలయంపై దాడులు జరిగాయి. అనేకసార్లు కేసులు పెట్టారు. జైలుకు కూడా వెళ్లొచ్చారు. లేటెస్ట్గా మరోసారి క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి చేశారు బీఆర్ఎస్ నేతలు. కట్ చేస్తే, ఆ మర్నాడే మల్లన్న అరెస్ట్ అవడం కలకలంగా మారింది.
మంగళవారం రాత్రి మల్లన్నతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసారు పోలీసులు. డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసులను నిర్భందించి దాడి చేశారని వారిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 363, 342, 395, 332, 307..R/w 34 సెక్షన్ 7(1) కింద కేసులు పెట్టారు. బుధవారం మల్లన్న బృందాన్ని కోర్టులో హాజరుపర్చగా.. వారికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. మల్లన్నతో సహా నిందితులను చర్లపల్లి జైలుకి తరలించారు మేడిపల్లి పోలీసులు.
మల్లన్న అరెస్ట్ ఎలా జరిగింది?
తీన్మార్ మల్లన్న, సుదర్శన్, విఠల్లను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పీర్జాదీగూడలోని క్యూన్యూస్ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న, విఠల్లను అదుపులోకి తీసుకోగా సుదర్శన్ను ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. క్యూన్యూస్ ఆఫీసులోని కొన్ని హార్డ్డిస్కులను స్వాధీనం చేసుకున్నారు.
మల్లన్న అరెస్ట్ విషయం తెలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు మంగళవారం అర్ధరాత్రి తీన్మార్ మల్లన్న ఇంటికి వెళ్లారు. ఆయన భార్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. మల్లన్నను ఎక్కడ అదుపులోకి తీసుకున్నారో.. అక్కడే సురక్షితంగా వదిలిపెట్టాలని పోలీసులను హెచ్చరించారు.
మల్లన్నను ఎందుకు అరెస్ట్ చేశారు?
మంగళవారం పీర్జాదిగూడ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తుండగా.. క్యూన్యూస్కు చెందిన కొందరు.. డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని కర్రలతో బెదిరించి, వాళ్లను బలవంతంగా క్యూన్యూస్ కార్యాలయంలోకి తీసుకెళ్లినట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు. పోలీసులను బంధించి, గదికి తాళం వేసి, ఫోన్లు, ఐడీ కార్డులు లాక్కున్నారని.. పోలీసులని తెలిసినా దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారని అన్నారు. సమాచారం అందగానే ఘట్కేసర్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి బంధీలుగా ఉన్న పోలీసులను రక్షించినట్టు చెప్పారు. ఆ సమయంలో క్యూన్యూస్ ఆఫీసులో ఉన్న సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని, వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు ప్రకటించారు.