Telangana congress party news(TS politics): పొంగులేటి పాయే. జూపల్లి వెళ్లే. అంతేనా? ఇంకెవరూ లేరా? అంటే నేనున్నానంటూ బీఆర్ఎస్ను వీడుతున్నారు మరో బిగ్ లీడర్. రంగారెడ్డి జిల్లాలో బలమైన నాయకుడైన తీగల కృష్ణారెడ్డి కారు దిగి.. కాంగ్రెస్లో చేరనున్నారు. ఆ మేరకు పార్టీ ఇన్చార్జ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిలతో భేటీ ఆయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన కోడలు అనితారెడ్డికి మహేశ్వరం టికెట్ అడుగుతున్నారు తీగల. ప్రస్తుతం అనితారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్గా ఉన్నారు. త్వరలోనే మామాకోడళ్లు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
మహేశ్వరంలో మంత్రి సబిత పెత్తనంపై తీగల ఆగ్రహంగా ఉన్నారు. ఈసారి కూడా మహేశ్వరం టికెట్ సబితకే దక్కే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాలతో తీగల కుటుంబం పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్లో చేరితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తీగల కుటుంబం భావిస్తోంది.
తీగల కృష్ణారెడ్డి.. టీడీపీ హయాంలో హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ-హుడా ఛైర్మన్గానూ ఉన్నారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సబిత బీఆర్ఎస్లో చేరగా.. తీగలకు ప్రాధాన్యం తగ్గిపోయింది. కోడలు అనితారెడ్డి మహేశ్వరం జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కావడంతో ఉనికి కాపాడుకున్నారు. సబిత, అనిత మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది.
సిట్టింగులకే టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉండటం.. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పెరుగుతుందటం.. రేవంత్రెడ్డి దూకుడు రాజకీయం.. ఆయనతో పాత సాన్నిహిత్యం.. ఇలా అనేక కారణాలతో వెటరన్ లీడర్ తీగల కృష్ణారెడ్డి అధికార పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మహేశ్వరంలో మంచి పట్టున్న తీగల కుటుంబం పార్టీ మారడం.. కారుకు భారీ డ్యామేజీనే.. కాంగ్రెస్కు అదనపు బలమే.