Jobs: డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్జీటీ.. 1,739 స్కూల్ అసిస్టెంట్.. 611 భాషా పండితులు.. 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.
అయితే, గతంలో మాదిరి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా.. అంతకుముందు అవలంభించిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ-DSC ద్వారానే నియామకాలు చేపడతామని విద్యాశాఖ ప్రకటించింది.
టెట్ క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి అర్హులు. ఇందులో అర్హత సాధించిన వారితో జిల్లాల వారీగా జాబితా ప్రిపేర్ చేస్తారు. ఆ లిస్ట్ను డీఎస్సీకి పంపిస్తారు. ఆ తర్వాత ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయి.
గతంలో డీఎస్సీ ద్వారానే టీచర్ నియామకాలు జరిగేవి. కానీ, ఆ తర్వాత నియామకాల బాధ్యతను TSPSCకి అప్పగించారు. ఇటీవల పబ్లిక్ కమిషన్పై పేపర్ లీకేజీలపై తీవ్ర విమర్శలు రావడంతో.. ఈసారి కమిషన్ను కాదని మళ్లీ డీఎస్సీ ద్వారానే భర్తీకి నిర్ణయం తీసుకుంది సర్కారు.
మరోవైపు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణకు సైతం తెలంగాణ సర్కారు ఆమోదం తెలిపింది. 16 ఏళ్లుగా 567 మంది ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. వారందరినీ రెగ్యులరైజ్ చేస్తూ.. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది ప్రభుత్వం.
ఎన్నికల వేళ సీఎం కేసీఆర్.. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారని అంటున్నారు.