Taraka Ratna : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. అయితే శనివారంతో పోలిస్తే కాస్త మెరుగవడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు తారకరత్న శరీరం స్పందిస్తోంది. బ్లడ్ క్లాట్ కావడం, ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో క్రిటికల్ పరిస్థితికి దారితీసింది.
తారకరత్నకు నారాయణ హృదయాల వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. స్టంట్ వేస్తే మళ్లీ హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు భావిస్తున్నారు. దీంతో స్టంట్ వేయలేదు. ఇంకా సపోర్టివ్ సిస్టమ్ పైనే ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. హార్ట్ స్టోక్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. ఈ విషయంపై వైద్యులు ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. బ్రెయిన్ డ్యామెజ్ అయ్యిందా? అయితే ఎంతవరకు అయ్యిందో వైద్యులు ప్రకటించాల్సి ఉంది. దీన్ని బట్టి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది.
చికిత్సకు తారకరత్న స్పందించడం కీలక పరిమాణంగా చెప్పుకోవాలి. ఎక్మో ట్రీట్ మెంట్ నుంచి వెంటిలేటర్ కు మార్చడం కూడా ఆయన కోలుకుంటారనే సంకేతాలను ఇస్తోంది. దీంతో తారకరత్న పరిస్థితి మరింత మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 48 గంటలు చాలా కీలకమని వైద్యులు భావిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాల వైద్యులు సోమవారం ప్రకటన చేసే అవకాశం ఉంది.
తారకరత్నకు వైద్య సేవల విషయంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి సుధాకర్ తెలిపారు. కుప్పం నుంచి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తారకరత్నను తీసుకొచ్చామన్నారు. బ్రెయిన్ కు సంబంధించిన ప్రత్యేక వైద్యులను నారాయణ హృదయాల ఆస్పత్రికి తీసుకొచ్చామన్నారు. ఇలా కర్నాటక ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తోందని భరోసా ఇచ్చారు.
నందమూరి తారకరత్న చికిత్స పొందుతున్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి భారీగా రాజకీయ, సినీ ప్రముఖులు వస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రికి నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద కర్ణాటక పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.