CPM first list : తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయబోతోంది సీపీఎం. 14 మందితో అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మరో ముగ్గురితో సాయంత్రం మరో లిస్ట్ విడుదల చేస్తామని స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు తీసుకున్న కేసీఆర్.. తర్వాత తమకు మిత్రద్రోహం చేశారని సీపీఎం నాయకులు ఆరోపించారు. అలాగే పొత్తు కోసం కాంగ్రెస్తో చేసిన చర్చలు ఫలించలేదని అన్నారు.
పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి, భద్రాచలం నుంచి కారం పుల్లయ్య, అశ్వారావుపేట నుంచి పిట్టల అర్జున్, మధిర నుంచి పాలడుగు భాస్కర్, వైరా నుంచి భూక్యా వీరభద్రం, ఖమ్మం నుంచి యర్ర శ్రీకాంత్, సత్తుపల్లి నుంచి మాచర్ల భారతి, నకిరేకల్ నుంచి బొజ్జ చిన వెంకులు, భువనగిరి నుంచి కొండమడుగు నరసింహ, జనగాం నుంచి కనకారెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి పడగల యాదయ్య, పటాన్ చెరు నుంచి మల్లిఖార్జున్, ముషీరాబాద్ నుంచి దశరథ్ లు పోటీ చేస్తారని సీపీఎం వెల్లడించింది. సీపీఐ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తాము బరిలో ఉండటం లేదని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించగల అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందన్నారు.