ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎన్నికల వేడి మరింత పెరిగింది. రాష్ట్రంలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. కాంగ్రెస్ తో జత కట్టేందుకు వామపక్షాలు అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నాయి.
తాజాగా కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు తీసుకుని.. ఇప్పుడు హ్యాండిచ్చిన కేసీఆర్పై కామ్రేడ్లు రగిలిపోతున్నారు. బీఆర్ఎస్ ఓడించి బుద్ధి చెప్తామంటూ ప్రతిజ్ఞలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ – లెఫ్ట్ నాయకులు కలిసి పనిచేస్తున్నారు.
తాజాగా తెలంగాణ సీపీఐ నాయకులతో రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సంప్రదింపులు జరిపారు. నాలుగు సీట్లు కేటాయించాలని సీపీఐ నాయకులు ప్రతిపాదనలు పెట్టారు. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం సీట్లు కోరారు. రెండు నియోజకవర్గాలు కేటాయిస్తామని కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. చివరికి 3 సీట్లనైనా ఇవ్వాలని సీపీఐ నేతలు అడిగారు.
సీపీఐకు రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఓ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. హస్తం ఆఫర్ కు సీపీఐ ఒకే చెబితే పొత్తులు కుదురుతాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి. మరోవైపు సీపీఎం కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఆ పార్టీ నేతలతోనూ మాణిక్ రావ్ ఠాక్రే చర్చలు జరపనున్నారు. వామ పక్షాలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది.