ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విద్యార్థులతో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే హైదరాబాద్ అశోక్నగర్లో భేటీ అవుతానని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్న తమకు అండగా ఉంటానని భరోసారి ఇచ్చారు. తెలంగాణ ఎన్నికలకు కౌంట్డౌన్కు సమయం ఆసన్నమవుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. తమపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకుని.. తిరిగి కారు జోరును పెంచేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఉద్యోగాలు రాక యువత కేసీఆర్పై గుర్రుగా ఉన్నారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై మండిపడుతున్నారు. దీంతో విద్యార్థుల మనసును మళ్లీ గెలిచేందుకు ఎత్తుగడలు రచిస్తోంది బీఆర్ఎస్. ఈ మేరకు అశోక్నగర్తో పాటు పలు యూనివర్సిటీల విద్యార్థులను కలిశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ప్రభత్వ ఉద్యోగ నియమాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
నిధులు, నీళ్లు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ పోరాటం జరిగింది. అయితే.. నీళ్లు, నిధులు సంగతేమో కానీ.. నియామకాలు లేవంటూ బీఆర్ఎస్ సర్కార్పై తీవ్రస్థాయిలో ఫైర్లో ఉన్నారు నిరుద్యోగ యువత. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు గడిచినా సీఎం కేసీఆర్కు నిరుద్యోగ యువతను పట్టించుకోవడం లేదని.. ఈసారి బీఆర్ఎస్ను గద్దె దించాలన్న కసిలో ఉన్నారు. దీంతో ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో వారిని తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు గులాబీ నేతలు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్పీ ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీపై హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఎన్నికల ఫలితాల మరుసటి రోజే అశోక్నగర్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతను కలుస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థుల సూచన మేరకు గ్రూప్ 2 ఉద్యోగాలను పెంచి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని.. మళ్లీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడదల చేస్తామని.. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వివిధ నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియపై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ను కలిసిన విద్యార్థులు అసలు నిరుద్యోగులే కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధే ఉంటే ఇంత వరకు కాలయాపన ఎందుకు చేశారని.. ఎన్నికల వేళ లేనిపోని కల్లబొల్లి హామీలతో మళ్లీ తమను మోసం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు నిరుద్యోగ యువత.