T-Congress Screening Committee : తెలంగాణ కాంగ్రెస్ ఆశావహులతో ఢిల్లీ కళకళలాడుతోంది. అవకాశం కల్పించాలంటూ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మరోవైపు టికాంగ్రెస్లో టిక్కెట్ల పంచాయితీతో హై కమాండ్ తలలు పట్టుకుంటోంది. ఇప్పటికే చాలా మంది నేతలు ఢిల్లీలో మకాం వేసేశారు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అటు మహిళా నేతలు సైతం దేశ రాజధానిలో తిరుగుతున్నారు.
అందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 20 టిక్కెట్లు ఇవ్వాలని సునీతారావు డిమాండ్ చేస్తున్నారు. టిక్కెట్లు ఇవ్వకుంటే ఇంటింటి ప్రచారంలో పాల్గోలేమని కరాకండిగా చెప్పేశారు. ఇదిలా ఉంటే రేణుకా చౌదరి హస్తినలో బైఠాయించేశారు. కమ్మ సామాజకవర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న ఖర్గేతోనూ భేటీ అయ్యారు.
అయితే నేడు మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో భేటీ కానుంది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. రేవంత్రెడ్డి, భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి హాజరుకానున్నారు. ఈ రోజు జరిగే సమావేశంలో 60 నుంచి 70 స్థానాలు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 15 లోపు అభ్యర్థుల మొత్తం జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉంది. 2 విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని సమాచారం. మొదటి జాబితాలో సింగిల్ అభ్యర్థుల సీట్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది.
గత సమావేశంలో దాదాపు 80కు పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అప్పటి భేటీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ స్థానాలతో పాటు ఇతర జిల్లాల్లో మిగిలిపోయిన నియోజకవర్గాలపైనా చర్చించనున్నారు.
వామపక్షాలతో పొత్తుపై సందిగ్ధత కొనసాగుతుండడంతో నాలుగైదు సీట్లు మినహా మిగతా స్థానాలపై నేటి భేటీలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయవచ్చని పార్టీవర్గాల సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్వహించదలచిన బస్సు యాత్రపైనా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఈ నెల 15న బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.
ఆశావహులు పలువురు దిల్లీలో మకాం వేసి.. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తదితరులను కలిసి తమకు టికెట్లు కేటాయించాలంటూ వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. గతంలోనే ప్రకటించినట్లు ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 2 చొప్పున 34 స్థానాలు కేటాయించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్లకు బీసీ నేతలు విన్నవించారు. ఏడేసి జనరల్ నియోజకవర్గాలున్న నిజామాబాద్, మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఆరేసి జనరల్ నియోజకవర్గాలున్న నల్గొండ, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మూడు చొప్పున శాసనసభ స్థానాలు కేటాయించాలని కోరుతున్నారు. టికాంగ్రెస్ నేతల వినతులపై నేడు జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.