T Congress Politics : ఒరిజినల్ కాంగ్రెస్.. వలస కాంగ్రెస్ నేతలంటూ సీనియర్లు చేసిన వ్యాఖ్యల దుమారం… కొనసాగుతోంది. రేవంత్ వర్గం నేతలు.. ఘాటుగా స్పందించారు. దశాబ్దాల పాటు అనేక పదవులు అనుభవించిన నేతలు.. అధికారం కోల్పోగానే పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు.. ఇదే సీనియర్లు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ను రక్షించుకోవాలన్న సోయి ఆనాడు ఏమైందని నిలదీస్తున్నారు. అప్పుడు గుర్తుకురాని సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని.. ఇప్పుడు ఎత్తుకోవడంలో సీనియర్ల ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ… రెండు సార్లు అధికారం దక్కకపోవడానికి కారకులు ఎవరని కార్యకర్తలు నిలదీస్తున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి పీసీసీ చీఫ్గా పొన్నాల ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టే నాటికి… అంటే 2021 జులై వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పీఠంపై కొనసాగారు.
పొన్నాల, ఉత్తమ్ పదవుల్లో ఉన్నప్పుడు… చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ను వీడి… ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇందులో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా పదవులు అనుభవించిన వారే అధికం. డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పాటు సురేశ్ రెడ్డి, వనమా, ఫరీదుద్దీన్, రెడ్యానాయక్, నేతి విద్యాసాగర్, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలా చెప్పుకుంటే పోతే.. కాంగ్రెస్ను వీడిన వారి జాబితా చాలా పెద్దగానే ఉంది.
ముఖ్యంగా 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా పార్టీ జంప్ నుంచి చేశారు. 12 మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నప్పుడు పార్టీని రక్షించుకోవాలన్న ఆలోచన చేయకపోవడం సేవ్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్న సీనియర్ల చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు పార్టీ విధేయులు అంటున్నారు.
వలసవాదుల నుంచి కాంగ్రెస్ను కాపాడాలంటున్న సీనియర్లు.. ఆనాడు ఏకంగా ప్రజా ప్రతినిధులే పార్టీకి గుడ్ బై చెబుతుంటే… ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. సామ రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి.
టీపీసీసీ కొత్త కమిటీల కూర్పు ఏకపక్షంగా జరిగిందేమీ కాదని… రేవంత్ వర్గం నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో పూర్తి స్థాయిలో సంప్రదించి, అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కమిటీలు ఖరారు చేశారని అంటున్నారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ముందే అధిష్ఠానానికి చెప్పాల్సిన సీనియర్లు.. ఇప్పుడు రాద్ధాంతం చేయడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కొత్త కమిటీల్ని తప్పుబట్టడం అంటే… అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించడమే అని రేవంత్ వర్గం నేతలు అంటున్నారు. పదే పదే పార్టీలో కల్లోలానికి కారణమవుతున్న సీనియర్లపై ఇకనైనా హైకమాండ్ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాలని.. లేదంటే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పి పోతుందని… క్షేత్రస్థాయి కార్యకర్తలు కోరుతున్నారు.