తెలంగాణ మాజీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి రోజున ఎన్నికల కౌంటింగ్ ముగియక ముందే అంజనీకుమార్ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిశారు. డీజీపీ హోదాలో అంజనీ కుమార్తో పాటు ఇతర పోలీస్ అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల సంఘం డీజీపీపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేశ్ భగవత్, సందీప్ కుమార్ జైన్కు నోటీసులు జారీ చేసింది.
దీనిపై ఈసీకి ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ వివరణ ఇచ్చుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించలేదని.. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వవనీ ఈసీకి వివరణ ఇచ్చుకున్నారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.