TRS: ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం 40 మాత్రమేనట. కేసీఆర్ చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని తెలుస్తోంది. కొంచెం కష్టపడితే గెలిచే సీట్లు 30 నుంచి 35 వరకు ఉన్నాయట. మిగిలిన చోట్ల టీఆర్ఎస్ చాలా వీక్ అనేది సర్వే సారాంశం. మొత్తం 119 నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించి.. ఆయా చోట్ల వేరువేరుగా ఫోకస్ పెట్టారట గులాబీ బాస్ కేసీఆర్.
అసలే టఫ్ ఫైట్. బీజేపీ దూకుడు మీదుంది. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహం కనబరుస్తోంది. ప్రతిపక్షాలు బలపడుతున్న సమయంలో.. అధికార పార్టీలో ఉత్సాహం నీరుగారి పోతోంది. ఈడీ, ఐటీ దాడులు ఓవైపు.. ప్రభుత్వ వ్యతిరేకత ఇంకోవైపు. మునుగోడులో గెలిచినా ఎలా గెలిచారో అందరికీ తెలుసు. అందుకే, మునుగోడు విజయం ఆ పార్టీకి ఏమాత్రం సంతోషం ఇవ్వట్లేదు.
తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్న విషయం కేసీఆర్కు కూడా తెలుసు. కానీ, కేవలం 40 స్థానాల్లో మాత్రమే విజయావకాశాలు ఉన్నాయని సర్వేలో తేలడం కలవరపెడుతోంది. అయితే, గులాబీ బాస్ ఆశలన్నీ ట్రయాంగిల్ వార్ పైనే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య చీలిపోతుందని.. ఆ మేరకు తాము లాభపడతామనేది కేసీఆర్ లెక్క. అయితే, మునుగోడులో అలా జరిగుంటే టీఆర్ఎస్ కు మరింత మెజార్టీ వచ్చుండేది. 10వేల ఆధిక్యానికే పరిమితమైందంటే.. ఓట్లు చీలిపోలేదనేగా?
అందుకే, గట్టిగా ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉన్న ఆ 30-35 స్థానాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, కీలక నేతలకు గెలుపు బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే, కొన్నిచోట్ల మంత్రులూ ఓడిపోయే అవకాశం ఉందనే సర్వే రిపోర్డు రావడం ఆసక్తికరం. ఉత్తర తెలంగాణలో బలంగానే ఉన్నా.. దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ లో టీఆర్ఎస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇక, ఖమ్మం జిల్లాతో మరో తలనొప్పి.
సిట్టింగులు అందరికీ మళ్లీ టికెట్ ఇస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించినా.. సర్వే తర్వాత మనసు మార్చుకునే ఉద్దేశంలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర వ్యతిరేకత ఉన్న చోట్ల సిట్టింగ్స్ ను మార్చేసే ఛాన్స్ ఉందని సమాచారం. కొందరు మంత్రులకూ టికెట్ డౌట్. అదే జరిగితే, పార్టీ ఫిరాయింపులు మరిన్ని జరగొచ్చు. సిట్టింగ్స్ కు టికెట్లు ఇస్తే ఆశావహులు గోడ దూకొచ్చు. ఇలా ఎలా చూసినా.. ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్స్ ల గోల పెరగొచ్చు. అసలే హోరాహోరీ పోరులో.. పార్టీ నుంచి వలసలు పెరిగితే మరింత కష్టం, నష్టం తప్పకపోవచ్చు. అందుకే, తాజా సర్వే గులాబీ బాస్ తో పాటు గులాబీ నేతలనూ తెగ టెన్షన్ పెడుతోందని అంటున్నారు.