Supremecourt :ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీంకోర్టులోనూ తెలంగాణ సర్కార్కు షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. కానీ తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టేటస్కో విధించేందుకు మాత్రం అంగీకరించలేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు గురించి సీజేఐ ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. హైకోర్టు ఉత్తర్వులుపై స్టే విధించాలని లేదా స్టేటస్ కో ఇవ్వాలని కోరారు. ఈ కేసు ఫైల్స్ సీబీఐ చేతికి వెళ్తే పిటిషన్ నీరుగారిపోతుందని వివరించారు. ఆ ఫైల్స్ ఇవ్వాలని సీబీఐ ఒత్తిడి చేస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు విన్న సీజేఐ.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే లేదా స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించారు. కేసుపై ఈ నెల 17న విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఆ రోజే అన్ని అంశాలూ పరిశీలిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో మెరిట్స్ ఉంటే ఇచ్చిన డాక్యుమెంట్లను వెనక్కి ఇవ్వాలని సీబీఐను ఆదేశిస్తామని తెలిపింది.
మరోవైపు హైకోర్టులోనూ ఈ కేసుపై విచారణ జరిగింది. తీర్పు ఆపాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిపేందుకు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నిరాకరించారు. కేసు దస్త్రాల కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని.. సింగిల్ జడ్జి వద్ద విచారణకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. కేసు ఫైల్స్ ఇవ్వాలని సీఎస్కు మంగళవారం సీబీఐ మరోసారి లేఖ రాసిందని చెప్పారు.
డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చాక మళ్లీ సింగిల్ జడ్జి విచారణ జరపకూడదని.. సుప్రీంకోర్టు మాత్రమే ఈ అంశంపై సమీక్ష చేస్తుందని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. త్వరగతిన కేసు విచారించాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరగా.. అందుకు అంతతొందరెందుకు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించగా.. తెలంగాణ సర్కార్ అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.