Kavitha: ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. కేసు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి కవిత తరఫున వాదనలు వినిపించారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్కు సుప్రీంకోర్టు ట్యాగ్ చేసింది. కవిత తన పిటిషన్లో సరికొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత నిందితురాలు కానప్పుడు విచారణకు ఎలా పిలుస్తారని కవిత తరపు న్యాయవాది కపిల్ ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన కేసుల తీర్పులను ఒకసారి పరిశీలించాలని కోరారు. దీనిపై స్పందించిన ఈడీ…పీఎంఎల్ ఏ చట్టం ప్రకారం అన్ని అధికారులున్నాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ తనకు పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు సీఆర్పీసీ సెక్షన్ 160కి విరుద్ధంగా ఉన్నాయని, వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కవిత ఆ పిటిషన్లో కోరారు. తన ఫోన్ను స్వాధీనం చేసుకొని, జారీ చేసిన జప్తు నోటీసులను రద్దు చేయడంతో పాటు.. ఫోన్ను సీజ్ చేయడం చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్ను నళినీ చిదంబరం వర్సెస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుకు జత చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తొలుత శుక్రవారం విచారణ జరుపుతామని చెప్పినా.. ఆ తర్వాత తదుపరి విచారణ తేదీని 27గా ప్రకటించింది. కాగా.. కవిత ఇప్పటికే ఈడీ ఎదుట మూడుసార్లు హాజరై.. తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.