Supreme Court Granted Bail to MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై.. ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టును ధర్మాసనం తప్పుబట్టింది. కవిత తరపున ముకుల్ రోహిత్గీ వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. రూ.10 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అలాగే బయటకు వెళ్లాక సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.
సుమారు గంటన్నర పాటు వాదనలు జరిగాయి. నేడు సుప్రీంకోర్టులో బెయిల్ పై వాదనలు ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్, ఇతర నేతలు ఉదయాన్నే ఢిల్లీకి చేరుకున్నారు.
Also Read: లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాకు బెయిల్.. దేశం విడిచి వెళ్లొద్దు!
మార్చి 15న కవితను తన ఇంటిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచి.. విచారణ చేశారు. విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని ఈడీ పలుమార్లు కోర్టుకు వెల్లడించింది. ఆ తర్వాత కవితకు అనారోగ్య సమస్యలు రాగా.. బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు కోర్టును కోరారు. తాజాగా కవిత వైరల్ ఫీవర్ తో బాధపడుతుందని తెలిసింది. సుమారు 165 రోజులు జైల్లో ఉన్న కవితకు బెయిల్ మంజూరు కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.
కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని బెంచ్ పేర్కొంది. లిక్కర్ కేసులో విచారణ పూర్తయి, ఛార్జిషీట్ దాఖలైనా కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని బెంచ్ అభిప్రాయపడింది. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందే అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది.