Summer Alert for Telugu States(Today weather report telugu): శివరాత్రి రాకముందే తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. నడినెత్తిన సూర్యుడు మాడు పగలకొడుతున్నాడు. ఉదయం 9 నుంచే ఎండ సుర్రుమంటోంది. చలి తగ్గి మార్చి మొదటివారంలోనే దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలే కాదు.. రాత్రి వేళల్లోనూ ఇప్పటి నుంచే ఉక్కపోతగా ఉంటోంది. చలిగాలి కాదు కదా. నిన్న ఏకంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోత, భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read More : శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్ కలకలం.. గెస్ట్ హౌస్ లో ఉన్న ఐదుగురు కలిసి..
ఇక తెలంగాణలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపింది. నిన్న రాష్ట్రంలోని సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి. విజయవాడలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట, నల్గొండ, వనపర్తిలో 39 డిగ్రీలు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, ములుగులో 38.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. హైదరాబాద్ లోని మోండా మార్కెట్, సరూర్ నగర్, లంగర్ హౌజ్ లో 38 డిగ్రీలు దాటింది. ఈ లెక్కన మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చి నెలలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే.. ఈ ఏడాది మార్చి3నే 37 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం గుండెల్లో గుబులు రేపుతోంది.
ఎండలు మండిపోతుండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గురువారం (మార్చి 7) వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని, ఏమైనా పనులు ఉంటే ఉదయం, సాయంత్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో మే వరకు వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం అత్యంత తీవ్రమైన వేసవిగా నమోదు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 10 సార్లైనా వడగాలులు వీస్తాయని అంటున్నారు. మజ్జిగ, మంచినీళ్లు, శరీరానికి చలువచేసే ఇతర పానీయాలను తరచుగా తాగాలని సూచిస్తున్నారు.