Sukesh: సుఖేశ్ చంద్రశేఖర్. మామూలోడు కాదు. జైల్లో ఉంటూనే కొందరికి చుక్కలు చూపిస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మార్చానంటూ.. ఆప్, బీఆర్ఎస్తో ఆటాడుకుంటున్నారు. కేజ్రీవాల్, కవిత టార్గెట్గా వరుసబెట్టి లెటర్ బాంబులు వదులుతున్నారు. ఇటీవల కేటీఆర్నూ టార్గెట్ చేశారు.
కవిత, బీఆర్ఎస్ విషయం ప్రస్తావించకుండా ఉంటే.. తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చేస్తే.. రూ.100 కోట్లు, శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో భూమి రాసిస్తామని ఆశ పెడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. అసలు సుఖేశ్ ఎవరో తనకు తెలీదన్నారు. పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
కేటీఆర్ కౌంటర్పై సుఖేశ్ మళ్లీ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్, అతని అనుచరులు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని సుఖేశ్ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలన్నీ నిజమేనని.. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. సీబీఐ, ఈడీ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. కేటీఆర్ మీద పరువునష్టం దావా వేయబోతున్నట్టు సుఖేశ్ తరఫు లాయర్ అనంత మల్లిక్ తెలిపారు.