Sukesh chandrasekhar latest news(Telugu breaking news today): ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ ఎంతగా టార్గెట్ చేశాయో.. అంతకంటే ఎక్కువగా తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ టార్గెట్ చేస్తున్నారు. వరుసబెట్టి లేఖలు రిలీజ్ చేస్తూ.. కేజ్రీవాల్ను, కవితను వెంటాడుతున్నారు. కేజ్రీవాల్ చెబితే కవిత తరఫు మధ్యవర్తికి డబ్బులు ఇచ్చానని.. ఆ వాట్సాప్ చాటింగ్ తన దగ్గర ఉందంటూ రెగ్యులర్గా అటాక్ చేస్తున్నారు. ఈసారి మరో అడుగు ముందుకేసి.. కేటీఆర్ను కూడా ఇందులోకి లాగారు. ఏకంగా గవర్నర్ తమిళిసైకే లేఖ రాశారు.
బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ తనను వేధిస్తున్నారని గవర్నర్కు రాసిన లేఖలో వివరించారు సుఖేశ్ చంద్రశేఖర్. కేజ్రీవాల్ కు, కవితకు జరిగిన ఆర్థికలావాదేవీలను గతంలో ఆధారాలతో బయటపెట్టానని.. ఇలా బయటపెట్టడంతోనే బీఆర్ఎస్ నేతలు తనను బెదిరిస్తున్నారని.. సాక్షాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో తెలిపారు.
సైలంట్ గా ఉంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలో భూమి, 100 కోట్ల నగదు, ఎన్నికల్లో సీటు ఇస్తామని మధ్యపెడుతున్నారని లేఖలో సంచలన ఆరోపణలు చేశారు సుఖేశ్. ఎదురు తిరిగితే దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటారని బెదిరిస్తున్నారని గవర్నర్ కు రాసిన లేఖలో తెలిపారు. ఆ మేరకు చాట్ హిస్టరీ కూడా బయటపెడతానన్నారు.
మరోవైపు, సుఖేశ్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తనకు సుఖేశ్ ఎవరో తెలియదని.. మీడియా ద్వారా మాత్రమే అతని గురించి విన్నానని తెలిపారు. తనపై సుఖేశ్ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని.. దీనిపై లీగల్గా చర్యలు తీసుకుంటానని ట్విట్టర్లో హెచ్చరించారు కేటీఆర్.