Telugu states Students Scored 100% in JEE Mains: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మంగళవారం విడుదలైయ్యాయి. ఇందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఎన్టీఏ విడుదల చేసిన పేపర్ 1కు సంబంధించిన ఫలితాల్లో 100శాతం స్కోర్ను సాధించినవారు 23 మంది విద్యార్థులు ఉన్నారు. 100శాతం స్కోరు సాధించిన వారిలో తెలంగాణకు చెందిన వారు ఏడుగురు కాగా.. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముగ్గురు విద్యార్థలు మొత్తం 10మంది విద్యార్థులు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం విశేషం.
తెలంగాణకు చెందిన పబ్బ రోహన్ సాయి, రిషి శేఖర్ శుక్లా, ముతవరపు అనూప్, మదినేని వెంకట సాయి తేజ, హుందేకర్ విదిత్, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేశ్ రెడ్డిలతో పాటు.. ఆంధ్రప్రదేశ్కు చెందిన తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డి, షేక్ సూరజ్, 100 పర్సంటైల్ స్కోరు సాధించారు.
2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్ 1 పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైయ్యారు. దీనికి సంబంధించిన ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరగనున్నట్లు ఎన్టీఏ వివరించింది. తొలి విడత రాసిన విద్యార్థులు మళ్లీ రెండో విడతకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు విడతలకు సంబంధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.