Dogs: వీధికుక్కలను చూడగానే జనాలు భయపడిపోతున్నారు. కనిపిస్తే అరకిలోమీటర్ దూరం పరుగెడుతున్నారు. వాటి పేరు వింటేనే వణికిపోతున్నారు. కొద్దిరోజులుగా వీధికుక్కల దాడులు పెరిగిపోయాయి. హైదరాబాద్లో బాలుడిపై విధీకుక్కలు దాడి చేసి హతమార్చినప్పటి నుంచి ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. గుంపులు గుంపులుగా ఉంటూ రోడ్డుపై వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి కుక్కలు. సామాన్యులనే కాదు.. అధికారులను కూడా వదలడం లేదు.
సిద్ధిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిపై వీధికుక్కలు దాడి చేశాయి. నగరశివారులో ఉన్న క్వార్టర్స్లో శ్రీనివాస రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఓ ఉదయం తన పెంపుడు కుక్కతో వాకింగ్కి వెళ్లాడు. ఆ సమయంలో వీధికుక్క అతడిపై దాడి చేసింది. గట్టిగా కరవడంతో అతని రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమికొట్టి అతడిని రక్షించారు.
వెంటనే సిద్ధిపేట ప్రభుత్వఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డికి వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే శనివారం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక అదే రోజున సాయంత్రం శ్రీనివాసరెడ్డి పెంపుడుకుక్కపై కూడా వీధికుక్కలు దాడి చేశాయి. మరునాడు ఉదయం అధికారుల క్వార్టర్స్కు సమీపంలోని పౌల్ట్రీ ఫామ్ వద్ద ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులకే భద్రత లేనప్పుడు.. స్థానికుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు వీధికుక్కలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.