Srirama Navami : భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట గర్భగుడిలో రామయ్య మూలవిరాట్కు లఘు కల్యాణం జరిపించారు. ఆ తర్వాత రాములోరి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో జగన్మాత సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
మిథిలా మైదానంలో త్రిదండి చినజీయస్వామి సమక్షంలో అర్చకులు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తుల రామనామస్మరణతో మైదాన ప్రాంగణం మారుమోగింది. భద్రాద్రిలో ఈ ఏడాది విభిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాములను ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికిపైగా భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు. అందుకు తగ్గట్లే భక్తుల రద్దీ ఉంది.
రాములోరి కల్యాణాన్ని భక్తులు ఎల్ఈడి తెరలపై కూడా వీక్షించారు. అలాగే భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు ఉంచారు. 70 కౌంటర్స్ ఏర్పాటు చేసి లడ్డూలు, తలంబ్రాల పంపిణీ చేపట్టారు. రాములోరి కల్యాణాన్ని వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. శుక్రవారం స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.