Singer Gaddar : మెదక్ జిల్లాలోని గజ్వేల్ తాలూకా తూఫ్రాన్ లో గద్దర్ జన్మించారు. ఆయన తండ్రి గుమ్మడి శేషయ్య మేస్త్రీగా పనిచేసేవారు.ఎక్కువగా ఉత్తర్ప్రదేశ్లో పని చేశారు. అక్కడ నిర్మించిన మిళింద విద్యాలయం నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారు. అంబేడ్కర్ను చాలా దగ్గర నుంచి చూసిన శేషయ్యకు ఆయన ప్రభావం పడింది. అందుకే తన పిల్లలను చదివించుకోవాలని సంకల్పించారు.శేషయ్యకు సంతకం పెట్టడం కూడా రాదు. అయినా సరే హిందీ, మరాఠీ, ఉర్దూ భాషలూ మాట్లాడేవారు. శేషయ్య ప్రభావంతోనే ఆ ఊళ్లో పిల్లలందర్నీ చదివించాలన్న భావన మొదలైంది. గద్దరకు అన్నయ్య, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. తల్లి పేరు లచ్చుమమ్మ.
గద్దర్ తల్లి పొలం పనికి వెళ్లేవారు. అందరికంటే చిన్నవాడైన గద్దర్ కూడా తీసుకెళ్లేవారు. అక్కడే గద్దర్ పాటకు బీజం పడింది. అమ్మ చేస్తున్న పనిమీదే ‘మోకాళ్ల మట్టుకు బురదలో అడుగేసి..ఎద్దోలె ఎనకెనక ఒక్కొక్క అడుగేసి.. నీ నడుమంత ఇరిగేనా లచ్చుమమ్మో.. లచ్చుమమ్మో’’ అని ఒక పాట రాశారు. తల్లే ఆయనకు మొదటి గురువు. ఆమె జానపద పాటలు, దొరల కళ్లు తెరిపించే పాటలు పాడేవారని గద్దర్ చాలాసార్లు చెప్పారు.
ఊళ్లో ఏడో తరగతి వరకు చదివిన తర్వాత పక్క ఊర్లో హాస్టల్లో ఉండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు గద్దర్. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండగానే ఉద్యమంలోకి అడుగుపెట్టారు.ఉద్యమం పేరుతో కొన్ని వందల ఊళ్లు తిరిగారు. అడవుల్లో బతికారు. అలా గుమ్మడి విఠల్రావు గద్దర్గా మారిపోయారు. కొన్నేళ్ల తర్వాత హైదరాబాద్లోని అల్వాల్లో తన చిన్నక్క ఇంటి దగ్గర ఓ ఇల్లు నిర్మించుకున్నారు. తల్లి, అన్నయ్య ఊళ్లోనే ఉండేవారు.
1980ల్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు గద్దర్. తాను అజ్ఞాతంలో ఉన్నప్పుడు తల్లిని చూడ్డానికి అప్పుడప్పుడు గద్దర్ మారువేషంలో ఊరికి వెళ్లి వస్తుండేవారు. తల్లి చనిపోయినప్పుడు, తన చిన్న కొడుకు మరణించినప్పుడు ఊరు వెళ్లానని ఒక సందర్భంలో చెప్పారు. 2008లో 6 నెలలపాటు అక్కడే ఉన్నానని తెలిపారు. 2018లో ఎన్నికల సమయంలో తొలిసారి ఓటరుగా పేరు నమోదు చేసుకొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేశారు. ఇలా ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసిన గద్దర్ ఆ తర్వాత ‘గద్దర్ ప్రజా పార్టీ’ని స్థాపించారు.