Sonia Gandhi: సోనియా గాంధీ. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ అధినేత్రి. వయసు మీదపడినా, ఆరోగ్యం సహకరించకపోయినా.. కాంగ్రెస్ బరువుబాధ్యతలు మోస్తూ వచ్చారు. ఇప్పుడు రాయ్పూర్లో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో రిటైర్మెంట్ ప్రకటించారు.
భారత్ జోడో యాత్రతో తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారు సోనియా. జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అన్నారు. 1998లో ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించానని.. 25 ఏళ్లలో ఎన్నో విజయాలు, అపజయాలు చూశానని చెప్పారు.
మన్మోహన్ సింగ్తో కలిసి 2004, 2009లో అందించిన యూపీఏ పాలన తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్కి, దేశానికి 2024 ఎన్నికలు పరీక్ష లాంటివన్నారు సోనియా గాంధీ.
మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుందని విమర్శించారు. దేశంలో ఆ పార్టీ విద్వేషాలను రగిలిస్తోందని మండిపడ్డారు. మైనారిటీలు, మహిళలు, దళితులే, గిరిజనులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. కొంతమంది వ్యాపారుల కోసం ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతోందని సోనియా విమర్శించారు.