సోనియాగాంధీ 78వ పుట్టినరోజు వేడుకలు గాంధీ భవన్ లో ఘనంగా జరిగాయి. ఏఐసీసీ సభ్యులు మాణిక్ రావ్ ఠాక్రే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వీహెచ్, మంత్రి భట్టి విక్రమార్క తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్, వీహెచ్ కలిసి 78 కిలోల కేక్ ను కట్ చేశారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
అనంతరం మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని సోనియాగాంధీకి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చామన్నారు. ప్రజల అవసరాలను తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. గాంధీభవన్ మెట్ల మీద నిలబడి సమస్యలను పరిష్కరించాలని అడిగే అవసరం లేకుండా.. ప్రజా దర్బార్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రాబోయే ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పూర్తిస్థాయి అభివృద్ధి చేస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఎంతో శ్రమించారన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అన్నారు. డిసెంబర్ 9, 2009 నాడు ఆనాటి కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మొదలుపెట్టారని గుర్తుచేశారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ ప్రకంపనలు వచ్చినా అన్నింటినీ తట్టుకుని.. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారుల 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చారు. డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు సోనియాగాంధీ ముఖంలో కనిపించిన ఆనందం తానెప్పుడూ చూడలేదన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామన్నారు. తెలంగాణ ప్రజలు కష్టకాలంలో సహాయం చేసినవారిని మర్చిపోరని ఈ ఎన్నికల్లో రుజువైందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ నిజమైన తెలంగాణ తల్లి అని కొనియాడారు. తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు నిరంతరం కష్టపడుతానని, 24 గంటలు ప్రజలకు అండగా నిలబడుతానన్నారు. కాగా.. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గాంధీభవన్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు సత్కరించారు.