Ramanthapur : ఆస్తి కోసం తల్లిని హతమార్చాడు ఓ కొడుకు. ఈ దారుణం ఉప్పల్ పీఎస్ పరిధిలో గల రామంతాపూర్ లో చోటుచెసుకుంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ లోని వెంకట్ రెడ్డి నగర్ లో కాసవేణి సుగుణమ్మ(65) అనే వృద్ధురాలు కొడుకు అనిల్, కోడలు తిరుమలతో కలిసి ఉంటోంది. అనిల్ అప్పులు చేసి.. ఏ పనీ చేయకుండా కాలం వెళ్లదీస్తున్నాడు.
ఈ నేపథ్యంలో సుగుణమ్మ పేరుపై ఉన్న ఇంటి కోసం తనతో గొడవపెట్టుకునేవాడు. వేధింపులు భరించలేక ఆమె 5 ఏళ్ల క్రితమే ఇంటిని కోడలి పేరున రిజిస్ట్రేషన్ చేసింది. ఈనెల 4న రాత్రి సుగుణమ్మ ఇంట్లో నిద్రపోయింది. అదే రాత్రి కొడుకు, కోడలు, మరో వ్యక్తి ఆమెను హత్యచేయాలని ప్లాన్ చేశారు. సుగుణమ్మ నిద్రలో ఉండగా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసారు. నిద్రలోనే చనిపోయినట్టు మరుసటి రోజు బంధువులకు సమాచారం ఇచ్చారు.
సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారు . అంత్యక్రియల సమయంలో బంధువులు మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడపై కమిలిపోయిన ఆనవాళ్లు కనిపించాయి. అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి శవ పరీక్ష చేయగా. శనివారం అసలు విషయం బయటపడింది. ముగ్గురిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.