Somesh Kumar : అందినకాడికి దోచుకోవడం. భూములను కొల్లగొట్టడం. ఆస్తుల కూడబెట్టుకోవడం. ఇదీ బీఆర్ఎస్ పాలనలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు సాగించిన దందా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాట అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి బండారం బయటపడింది.
తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సోమేష్ కుమార్పై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ శివారులో పాతిక ఎకరాల భూములు తన భార్య పేరు మీద కొనుగోలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సర్వే నెంబర్లు 249, 260లో సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూములను సోమేష్ కుమార్ భార్య పేరుతో కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. అయితే.. ఐఎఎస్ అధికారుల నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని DOPTకి చెప్పాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఈ సమాచారాన్ని దాచిపెట్టారని సోమేష్ కుమార్పై ఆరోపణలు వచ్చాయి.
కేసీఆర్ హయాంలో బిహార్ బ్యాచ్ తెలంగాణను దోచుకున్నది అనేందుకు సోమేష్ కుమార్ వ్యవహారమే ఒక ఉదాహరణ అని విమర్శలు వస్తున్నాయి. ఆయన బాటలో మరికొందరు అధికారులు పయనించారని, నిబంధనలకు విరుద్ధంగా భూ క్రయ విక్రయాలు చేశారని అంటున్నారు. కేసీఆర్ హయాంలో ఉన్నత స్థానాల్లో పనిచేసిన అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరపాలని, చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.