Somesh Kumar: మాజీ సీఎస్ సోమేష్ కుమార్ మళ్లీ తెలంగాణ వస్తున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో.. తిరిగి రాష్ట్రానికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో సోమేష్ కుమార్కు కీలక పదవి ఖాయమన్న చర్చ జరుగుతోంది.
దాదాపు మూడేళ్ల పాటు తెలంగాణ సీఎస్గా పనిచేసిన సోమేష్ కుమార్ను.. కోర్టు ఉత్తర్వుల మేరకు ఏపీ కేడర్కు పంపారు. అక్కడి సీఎస్ జవహర్ రెడ్డికి రిపోర్టు చేసిన సోమేష్ కుమార్.. సీఎం జగన్ను కలిశారు. ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సోమేష్ కుమార్ ఇటీవలే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం ఒకే చెప్పేసింది. ఫైల్ను డీవోపిటి విభాగానికి పంపింది. ఒకటి రెండు రోజుల్లో అక్కడ కూడా ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది.
డీవోపీటీ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే సోమేష్ కుమార్.. తెలంగాణ ప్రభుత్వంలో స్పెషల్ సీఎస్గా చేరబోతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ మేరకు రంగం సిద్ధమైంది. తెలంగాణ సీఎస్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎక్సైజ్, కమర్షియల్ టాక్సెస్ సెక్రటరీగానూ కొనసాగారు. త్వరలో తెలంగాణ స్పెషల్ సీఎస్గా పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా ఆ రెండు శాఖల బాధ్యతలను ఆయనే చూసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ శాఖల బాధ్యతలను సోమేశ్కు అప్పగించే అవకాశాలున్నాయి. సోమేష్ కుమార్ ఏపీకి రిలీవ్ అయిన తర్వాత కూడా ఆ శాఖల బాధ్యతలను ఇప్పటివరకు వేరే ఏ అధికారికీ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించలేదు. ఆ శాఖల మీద ఆయనకు అనుభవం ఉన్నందున సోమేశ్ను స్పెషల్ సీఎస్గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్ పరిమాణం కూడా గత ఏడాదితో పోలిస్తే పెరిగిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు వస్తాయని బడ్జెట్లో అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ గతేడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకున్న విధంగా నిధులు అందుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేదు. దీంతో స్వీయ ఆర్థిక వనరులపైనే రాష్ట్రం ఆధారపడటం అనివార్యంగా మారింది. ఈ టాస్క్లో సోమేశ్ కుమార్ తనదైన శైలితో సక్సెస్ అవుతారని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం సెక్రటేరియట్గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచే సోమేష్ కుమార్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం పదో అంతస్తులో ప్రత్యేకంగా ఛాంబర్ సిద్ధం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి వీఆర్ఎస్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నా.. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో బీఆర్కే భవన్లో కొత్త చాంబర్ పనులు ఎవరికోసమనేది బయటకు రాలేదు.
ఐఏఎస్ అధికారులుగా పనిచేసినవారిని ఏదో ఒక పోస్టులో నియమించుకుంటున్న కేసీఆర్.. సోమేశ్ కుమార్కు సైతం అలాంటి ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎస్గా పనిచేసి రిటైర్ అయిన రాజీవ్శర్మను ముఖ్య సలహాదారుగా, ఎస్కే జోషిని సాగునీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించుకున్నారు. మరో రిటైర్డ్ అధికారి కేవీ రమణాచారిని సాంస్కృతిక సలహాదారుగా పెట్టుకున్నారు. ఇక రిటైర్డ్ డీజీపీ అనురాగ్శర్మను, ఏకే ఖాన్ లాంటి పలువురిని కూడా అడ్వయిజర్లుగా నియమించుకున్నారు. ఇప్పుడు ఆ వరుసలో సోమేశ్ కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేరనున్నారు. స్పెషల్ సీఎస్గా అపాయింట్మెంట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన మరోసారి చక్రం తిప్పుతారన్న చర్చ ఐఏఎస్ వర్గాల్లో మొదలైంది.