CM Revanth Reddy: యువతలో నైపుణ్యాలు పెంచి వారికి ఉద్యోగ అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నది. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం సలహాలు, సూచనలను విద్యావేత్తలు, మేధావులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సటీ ముసాయిదాను అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి సహా పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీ గురించి, ఆ యూనివర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సుల గురించి చర్చించినట్టు తెలిసింది.
యూనివర్సిటీలో కోర్సులు, డిప్లోమా కోర్సులకు సంబంధించి వివరాలను సీఎం, డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. డిమాండ్ ఎక్కువ ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని, శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటులో నిధుల విషయంలో రాజీపడొద్దని సూచనలు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని వివిధ సమస్యలను, విద్యా వ్యవస్థలోని లోపాలను విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించామని వివరించారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు స్పష్టం చేశారు.
Also Read: హార్దిక్ పాండ్యా ఏం తప్పు చేశాడని కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదు?
ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్వాడీలలో విద్యనందించడానికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ప్రతి అంగన్వాడీలలో విద్యాబోధనకు ఒక టీచర్ను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు. 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఇది వరకే అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.
పదేళ్లుగా యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ లేదనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి విద్యావేత్తలు తీసుకువచ్చారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ కేటాయించాలని కోరారు. విద్య, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. విద్యా కమిషన్ ద్వారా విద్యారంగ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.