MLAs Purchase Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్తోపాటు కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. వారు విచారణకు హాజరుకాకపోవడంతో సిట్ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చింది. బీఎల్ సంతోష్ , తుషార్ , జగ్గుస్వామిని అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
దర్యాప్తులో సేకరించిన ఆధారాల ప్రకారం సిట్ అధికారులు మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో పలువురు రాజకీయ నాయకులు ఉన్నారని సమాచారం. మరోవైపు ఆరు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలతో నిందితులు చర్చించినట్లు ఫోన్ రికార్డుల ద్వారా వెల్లడైంది. ఫోన్ రికార్డుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో నిందితులపై కేసులు నమోదు చేయించాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.
సోమవారం ఉదయం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాలని బీఎల్ సంతోష్కు తొలుత సిట్ నోటీసు ఇచ్చింది. కానీ విచారణకు హాజరుకాలేదు సంతోష్. ఎందుకు హాజరుకాలేదనే విషయంపైనా సిట్ కు సమాచారం ఇవ్వలేదు. సంతోష్తోపాటు కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, తుషార్ , జగ్గుస్వామికూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగతా ముగ్గురు విచారణకు హాజరుకాలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్ట్ చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్ను అరెస్టు చేయవద్దని సిట్ను న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడు, అడ్వకేట్ శ్రీనివాస్ను ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నించారు.