TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీతో ప్రభుత్వం పరువంతా పోయింది. ఏఈ ఎగ్జామే కాకుండా గ్రూప్ 1 పేపర్ సైతం లీక్ అవడం కలకలం రేపింది. మొత్తం నాలుగు పేర్లు బయటకు వచ్చాయని తేలడం సంచటనంగా మారింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిలను సిట్ ప్రశ్నిస్తోంది. వారి నుంచి పేపర్ లీకేజీపై సమగ్ర సమాచారం రాబడుతోంది.
అయితే, సిట్ దగ్గర కంటే కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దగ్గరే ఎక్కవ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. పేపర్ లీకేజీ వెనుక కేటీఆర్ పీఏ తిరుపతి ఉన్నారంటూ ఆరోపించారు. తిరుపతి స్వగ్రామం మల్యాల మండలంలో 100 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని అన్నారు. గతంలో జరిగిన గ్రూప్ 1 ప్రశ్నాపత్రం కూడా లీక్ అయిందని.. ఎన్నారైలకు పేపర్ అమ్ముకున్నారంటూ పలు ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. మరోవైపు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇలాంటి విమర్శలే చేశారు.
కట్ చేస్తే, రేవంత్రెడ్డి ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సిట్ నోటీసులు జారీ చేయడం పొలిటికల్ హీట్ పెంచేసింది. రేవంత్రెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలు తమకు ఇవ్వాలని సిట్ నోటీసుల్లో ఆదేశించింది. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్లోని రేవంత్ ఇంటికి వెళ్లారు సిట్ అధికారులు. నోటీసులు తీసుకునేందుకు రేవంత్ సిబ్బంది నిరాకరించడంతో.. ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు.
సిట్ నోటీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నోటీసులకు భయపడేదే లేదన్నారు. సిట్ నోటీసులను స్వాగతిస్తున్నానని.. వివరణ ఇస్తానని అన్నారు. తన దగ్గర ఉన్న సమాచారం సిట్కు అందిస్తానని చెప్పారు. అయితే, కేటీఆర్కు కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్రెడ్డి.
పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని.. ఆందోళనకు గురైన 30లక్షల మంది నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున అండగా ఉంటామన్నారు.
మరోవైపు, ఈ నెల 24, 25 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నారు పీసీసీ చీఫ్. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు నిరసనగా ఓయూలో రెండు రోజుల పాటు దీక్షకు దిగనున్నారు.