SIT Notices : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. మరింత దూకుడుగా ముందుకెళుతోంది. తాజాగా సిట్ అధికారులు మరో అయిదుగురికి నోటీసులు ఇచ్చారు. కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామి సోదరుడు మణిలాల్, అతని సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్కు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు హెచ్చరించారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీ ఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలకు చేసుకుందుకు ప్రయత్నించిన కేసులో సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు నంద కుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులతో సంబంధాలపై సిట్ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ప్రతాప్ గౌడ్, నందకుమార్ లావాదేవీలపై విచారిస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజులుతో ఉన్న పరిచయాలపై విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఈ కేసులో ఆధారాల కోసం సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అలాగే వైఎస్ఆర్ సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఇలా ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్న కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=OL_BpXkoyG8