Farmhouse Case: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో సిట్ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఏసీబీ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా.. అందుకు న్యాయమూర్తి అనుమతించారు. దీంతో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని.. టైట్ సెక్యూరిటీతో రాజేంద్రనగర్ పీఎస్ కు తరలించారు. అక్కడ సిట్ బృందం వారిని ప్రశ్నిస్తోంది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు.. నిందితుల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగనుంది. నిందితుల స్టేట్మెంట్ను వీడియో రికార్డు కూడా చేస్తున్నారు. మరోవైపు, రామచంద్రభారతి దగ్గర నకిలీ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్నాయంటూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన కంప్లైట్ మేరకు మరో కేసు కూడా నమోదవగా.. దానిపైనా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
ఫాంహౌజ్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఫాంహౌజ్ వీడియోలను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 4+4 సెక్యూరిటీ కల్పించారు. కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సిట్.. ఆ ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకొని.. లోతుగా ప్రశ్నిస్తోంది.
వారి వెనుక ఎవరున్నారు? ఎవరు పంపిస్తే వచ్చారు? ఎమ్మెల్యేలకు ఇస్తానన్న డబ్బు ఎక్కడిది? ఆ డబ్బు ఎవరు అరేంజ్ చేస్తారు? ఇలా పూర్తి వివరాలు రాబట్టనున్నారు. ఫాంహౌజ్ వీడియోలో అమిత్ షా, బీఎల్ సంతోష్, తుషార్ ల పేర్లు ప్రముఖంగా వినిపించడంతో.. ఆ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది సిట్.