Farmhouse case: గతంలో అనేక కేసుల్లో సిట్ లు వేశారు. చాలా సిట్ లు కొన్నిరోజుల హడావుడికే పరిమితమయ్యాయి. ఆ తర్వాత సైలెంట్ అయ్యాయి. ఫాంహౌజ్ కేసులో సిట్ కూడా మిగతావాటిలానే అనుకున్నారు కొందరు. కానీ, ఈ సిట్ చాలా స్ట్రాంగ్ గురూ.
ఎక్కడి మొయినాబాద్ ఫాంహౌజ్ కేసు.. ఎక్కడ ఢిల్లీలో ఉండే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్.. ఇంకెక్కడి కేరళ వైద్యుడు జగ్గుస్వామి.. తిగలాగుతూ ఎక్కడెక్కడి డొంకలో కదిలించే ప్రయత్నం చేస్తోంది సిట్.
లేటెస్ట్ గా, బండి సంజయ్ అనుచరుడైన కరీంనగర్ కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ ను సుదీర్ఘంగా విచారించింది సిట్ టీమ్. సింహయాజులుకు ఫ్లైట్ టికెట్ ఎందుకు బుక్ చేశారనే అంశంపై ప్రశ్నించింది. ముందుగా ఊహించినట్టే, పూజలు చేయించుకునేందుకే స్వామీజీకి విమానం టికెట్ బుక్ చేశానని శ్రీనివాస్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, శ్రీనివాస్.. సింహయాజులు, నందకుమార్ లతో మాట్లాడిన కాల్ డేటా వివరాలు ముందేసి.. ఫుల్ డిటైల్స్ రాబట్టారని సమాచారం.
సిట్ విచారణలో శ్రీనివాస్ కీలక సమాచారం వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా త్వరలోనే బీజేపీ రాష్ట్ర నేతలకు సైతం నోటీసులు జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
అటు, సుప్రీంకోర్టు సైతం సిట్ దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడం, హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణ సైతం అవసరం లేదనడంతో.. సిట్ బృందానికి మరింత పవర్ వచ్చినట్టైంది. అదే జోష్ లో మరింత దూకుడుగా ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరుకాని బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. వారి అరెస్టులపై సిట్ బృందం న్యాయనిపుణుల అభిప్రాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫాంహౌజ్ కేసులో రేపోమాపో సంచలన అరెస్టులు తప్పకపోవచ్చని అంటున్నారు.