Farm House Case : హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా బయటపడిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో సూత్రధారులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఎవరీ జగ్గుస్వామి?
కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్యకళాశాలలో జగ్గుస్వామి పనిచేస్తున్నారు. ఆయన ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అక్కడ జగ్గుస్వామి లేకపోవడంతో ఆయన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయానికి నెల 21న హాజరుకావాలని ఆదేశించారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సిట్ అధికారులు బృందం ఐదురోజులపాటు కేరళలోనే ఉంది. జగ్గుస్వామి దొరకపోవడంతో తిరిగి హైదరాబాద్ చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్రభారతి, బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్కి మధ్యవర్తిగా జగ్గుస్వామి వ్యవహరించినట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. జగ్గుస్వామి, తుషార్ను ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.ఇప్పటికే బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
న్యాయవాది శ్రీనివాస్ పాత్రేంటి?
కరీంనగర్ చెందిన న్యాయవాది బూసారపు శ్రీనివాస్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింహయాజీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మొత్తంమీద ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నిజాలను నిగ్గుతేల్చే పనిలో ఉంది. దర్యాప్తును కొలిక్కి తెచ్చేందుకు సిట్ బృందం ప్రయత్నిస్తోంది.