Jagan KCR: గులాబీ బాస్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పార్టీ శ్రేణులకు పదే పదే మీటింగులు పెట్టి క్లాస్ ఇస్తున్నారు. పైపై ప్రచారాలు పక్కన పెట్టాలని.. ప్రజల్లోకి వెళ్లాలని గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలను బాగా ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా 21 రోజులు ప్రతీ ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉండాలని.. వారిని పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉందని అల్టిమేటం జారీ చేశారు కేసీఆర్. పద్దతిగా పని చేస్తేనే ఎమ్మెల్యే టికెట్.. లేదంటే లే.. అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. బీఆర్ఎస్సే గెలుస్తుందని.. 100కు పైగా సీట్లు వస్తాయంటూ నేతలకు భరోసా కల్పిస్తున్నారు. లేటెస్ట్గా జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం సారాంశం ఇది.
కేసీఆర్ వ్యాఖ్యలు, ప్రచార వ్యూహాలు.. అచ్చం ఏపీ సీఎం జగన్ లానే ఉన్నాయంటున్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టి ఇలాంటి దిశానిర్దేశమే చేశారు. ఏపీలో కొన్ని నెలలుగా గడప గడపకు మన ప్రభుత్వం.. కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ పేరు పెట్టకున్నా.. కేసీఆర్ సైతం తమ నేతలను గడప గడపకు తిరగమని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
గత సమావేశంలో ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు జగన్ చాలా సీరియస్గా చెప్పారు. గడప గడపు వెళ్లే, వెళ్లని నాయకుల చిట్టా ముందేశారు. ఎవరెవరు ఎన్నెన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో.. ఎవరు డుమ్మా కొట్టారో.. అన్ని లెక్కలు చూపించి మరీ క్లాస్ పీకారు. ఇలా చేస్తే టికెట్ లే.. అంటూ హెచ్చరించారు కూడా. వైనాట్ 175 అన్నారు. సేమ్ టు సేమ్.. కేసీఆర్ కూడా అదే చెప్పడాన్ని ఎలా చూడాలి? ఎమ్మెల్యేలంతా 21 రోజులు ప్రజల్లోనే ఉండాలని ఆదేశించడం జగన్ను ఫాలో కావడమేగా..అంటున్నారు.
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే.. భారీ బహిరంగ సభలు, టీవీ, పేపర్లలో యాడ్లు, నగరాల్లో ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ప్రచారాలు.. ఇవీ. ఈ ట్రెండ్ను మార్చేసింది మాత్రం జగనే. పాత తరహా ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూనే.. ఎమ్మెల్యేలను గడప గడపకూ తిప్పుతున్నారు. ఎప్పుడో ఎన్నికల వేళ మాత్రమే కనిపించే తమ నేత.. ఇలా ఇంటి ముందుకు వచ్చి.. మీకేం కావాలి? మీ సమస్యలేంటి? అని అడుగుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కోపం ఉన్నవాళ్లంతా ఎమ్మెల్యేను అక్కడే నిలదీస్తున్నారు. ఆ రకంగానూ వారి కోపం కాస్త చల్లారి.. అది పార్టీకి పాజిటివ్గా మారుతోందని అంటున్నారు. గ్రామ వాలంటీర్ల నుంచి.. ఎమ్మెల్యే వరకూ.. అంతా ప్రజల వద్దకే పాలన అంటూ.. మీ ఊరికొచ్చాం.. మీ ఇంటికొచ్చాం.. మీ నట్టింటికొచ్చాం.. అని ప్రజల సమస్యల అడిగి తెలుసుకోవడం పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అవి తీరుస్తున్నారా? లేదా? అనేది వేరే విషయం. గడప గడపకూ మన ప్రభుత్వం.. మాత్రం ఏపీలో మంచి రిజల్ట్సే ఇస్తున్నాయని అంటున్నారు.
ఈ ప్రోగ్రామ్ గులాబీ బాస్కు సైతం తెగ నచ్చేసినట్టుంది. గెలిచాక ప్రజల ముఖమే చూడని ఎమ్మెల్యేను.. జోలపట్టి ఆ ప్రజల దగ్గరికే పంపిస్తే..? ఆ తిట్లేదో ఇప్పుడే తినేస్తే..? చేసింది, చేయబోయేది చెప్పేస్తే.. మధ్యలో వేరే పార్టీకి ఛాన్స్ లేకుండా పోతుంది. అందుకే, ఈ ఐడియా అదుర్స్ అంటున్నారు కేసీఆర్ సైతం. జగన్ తరహాలోనే గడప గడపకు మన ప్రభుత్వాన్ని.. తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఎమ్మెల్యేల నెత్తిన పెట్టారు. చెప్పినట్టు చేస్తే ఓకే.. లేదంటే నో టికెట్.. అంటూ బెదిరిస్తున్నారు.
రాజకీయ చాణక్యుడు, అపర మేధావి అని ప్రచారం చేసుకునే కేసీఆర్.. ఇలా యంగ్ లీడర్ జగన్ ప్రచార వ్యూహాలను ఫాలో అవుతుండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మా జగనా మజాకా.. అని వైసీపీ అభిమానులు పోస్టులు పెడుతుంటే.. కేసీఆర్ ఇలాంటివి చాలా చూశారంటూ సపోర్టుగా నిలుస్తోంది గులాబీ దండు. అయితే, వారిద్దరిలో ఒక తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వైనాట్ 175 అని జగన్ అంటుంటే.. కేసీఆర్ మాత్రం 95-105 దగ్గరే ఆగిపోతున్నారు.