Siddipet : సిద్దిపేట జిల్లా అహ్మదీపూర్లో టీఆర్ఎస్ లీడర్ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వం, అధికార పార్టీ నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి తీసుకున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రవీణ్ అనే టీఆర్ఎస్ లీడర్ పెట్టిన టాార్చర్ వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ.. బాధితుడు రమేష్ సెల్ఫీ విడియో చెప్పాడు. తనను ఎంతగా ఇబ్బందులకు గురిచేసిందీ.. ఆ వీడియోలో స్పష్టంగా తెలిపాడు.
మరోవైపు…. టీఆర్ఎస్ లీడర్ ప్రవీణ్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాలుగు సార్లు డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం ఎంపికయినా….. టీఆర్ఎస్ లీడర్ సూచనతో జాబితా నుంచి రమేశ్ పేరును తొలగించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో చేరితేనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయిస్తామంటూ ప్రవీణ్ వేధింపులకు పాల్పడ్డట్టు రమేశ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రమేశ్ భార్యను కూడా ప్రవీణ్ వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. ఎన్నోసార్లు వేడుకున్నా… ప్రవీణ్ కనికరించలేదని రమేశ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
అహ్మదీపూర్కు చెందిన రమేశ్…. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకపోవడంతో ఆవేదనతో… కలెక్టర్ ఆఫీస్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. టీఆర్ఎస్ స్థానిక లీడర్ ప్రవీణ్… వేధింపులే తన మరణానికి కారణమని చెప్పాడు. అటు…. రమేశ్ మృతి చెందడంపై… రాజకీయ దుమారం తీవ్రరూపు దాల్చుతోంది. రమేశ్ కుటుంబాన్ని… బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పరామర్శించారు.
అటు… రమేశ్ ఆత్మహత్య పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి పోస్ట్ మార్టమ్ నిర్వహించడాన్ని రఘునందన్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. అధికార పార్టీ నేతల తప్పు లేకపోతే…. అర్ధరాత్రి చీకటి పూట పోస్ట్ మార్టం చేశారని ప్రశ్నించారు. సొంత ఇల్లు, గజం స్థలం కూడా లేని వ్యక్తి…. డబుల్ బెడ్ రూమ్ కేటాయించేందుకు అర్హుడు కాదా అని అన్నారు. తెలంగాణలో దళితులు,పేద వర్గాలు ఎక్కడ చెప్పుకున్నా న్యాయం జరగడం లేదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అందుకే పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఆత్మహత్యల్ని కప్పి పుచ్చేకునేందుకు మొదటగా పోలీసుల్ని, తర్వాత డబ్బును ప్రయోగిస్తోందని విమర్శలు గుప్పించారు.