Phone Tapping Case latest news(Today news in telangana): తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ అమెరికా నుంచి ఇండియాకు రానుంది. నేడు ఆయన అమెరికా నుంచి ఇండియాకు రానున్నారు. ప్రభాకర్ రావును ఈ కేసులో విచారిస్తే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి. ప్రభాకర్ రావును విచారించిన అనంతరం బీఆర్ఎస్ అధినేతతో పాటు మరికొంత మంది కారు పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక నేతల పేర్లు చెబుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.
ఈ కేసులో కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. సుదీర్ఘ కాలం ఎస్ఐబీలో పని చేసిన దయానంద రెడ్డికి ప్రభాకర్ రావుతో సన్నిహిత్యం ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో ఆయన పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు తిరుపతన్న, భుజంగరావు కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ తర్వాత వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టిన దర్యాప్తు బృందం.. వారు ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్టు చేసే అవకాశముంది.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ ఏంటీ?.. మరో అరెస్ట్కు సిద్ధమా..
మాజీ డీసీపీ రాధా కిషన్ రావు కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. 10 రోజులు రాధా కిషన్ రావును కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. మరోవైపు పోలీసులకు ఫోన్ టాపింగ్ పై వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ కేసులో ఏ4గా ఉన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు.
అలాగే దుబ్బాక ఎలక్షన్ సమయంలో రఘునందన్ రావు, బంధువుల నుంచి కోటి రూపాయలు, మునుగోడు బై పోల్ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు సీజ్ చేసినట్లు వెల్లడించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.